తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు?

  • కేరళ సీఎం ఎంపికపై వీడని సందిగ్ధత
  • ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ వెలువడని తుది నిర్ణయం
  • సీఎం పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల మధ్య తీవ్ర పోటీ
  • అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏఐసీసీ
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారం కొలిక్కి వచ్చింది. టీవీకే అధినేత విజయ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. ఇక కేరళ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. దీంతో కేరళ సీఎం ఎంపిక వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు శనివారం ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం పదవి రేసులో ఉన్న వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల సమావేశమయ్యారు. మూడు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు.

సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుది నిర్ణయాన్ని త్వరలోనే ఖర్గే, రాహుల్ గాంధీ తీసుకుంటారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతుండటంతో అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. సీఎం ఎవరనేది ప్రకటించే ముందు అధిష్టానం పెద్దలు మరోసారి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Kerala Chief Minister
Kerala
Mullikharjuna Kharge
Rahul Gandhi
VD Satheesan
KC Venugopal
Ramesh Chennithala
Congress
UDF
Kerala Assembly Elections

More Telugu News